ఓం
ఓం విఘ్నేశ్వరాయనమ: ఓం నమశ్శివాయ:
శ్రీ బాలగురునాథ స్వామియే నమ:
శ్రీ మహావిష్ణువు నాభి నుండి వెలువడ్డ పద్మం మీద ఆసీనుడై ఉన్న "బ్రహ్మ" సంకల్పం మాత్రం చేత భూమి మీద కొండలు, నదులు, జలాశయాలు, చెట్లు, ఔషధమొక్కలు మొదలైనవి సృష్టింపబడ్డాయి. పుష్ప, ఫలభరితమైన వృక్షాలు, పచ్చని పంటపొలాలతో శోభాయమానంగా విలసిల్లే భూమిని సృజింపజేశాడు. అటువంటి శోభాయమానమైన ఈ భూమిలో ఎన్నో గొప్ప వృక్షములు, దానిలో వృక్షరాజము(వట వృక్షము) మర్రి చెట్టు అతి మహోన్నతమైనది.
ఈ మహోన్నతమైన వృక్షరాజము ఎన్నో వింతలకు, విశేషాలకు నిలయం. ఎందరో మునుల తపోదీక్షకు నిలయమైనది. మర్రిచెట్టు ఎన్నో శాఖోపశాఖములుగా విస్తరించి ఈ భూమి సమస్తమందూ నేనున్నాను యని, చాటి చెప్పునట్లుగా తన వేర్లనే శాఖలగా విస్తరింపజేసి మహోన్నతంగా, నయనానంద కరంగా, మానవుడు తలచుకుంటే ఎంత దూరమైనా తన మేధస్సుతో విస్తరించగలడు అనే సత్యాన్ని, తనను చూసి నేర్చుకోవాలి అన్న రీతిలో విశాలంగా కొన్ని ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ వృక్షరాజము ఐశ్వర్యానికి ప్రతినిధియైన కుబేర నిలయం కూడాను. ఈ వటవృక్షం క్రింద మరే ఇతర వృక్షములు, మొక్కలు పైకి వృద్ధి చెందలేవని ప్రతీతి. బ్రహ్మ సృష్టిలో నుండి వెలువడిన ఈ మహోన్నత వృక్షరాజము మహా ప్రశస్తియైనది. ఎన్నో ప్రాణులకు, పక్షులకు నివాసయోగ్యమైనది. బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన "ధర్మువు" కుమారులు నర నారాయణులు. పరమ తపోధనులు, విష్ణ్వాంశ సంభూతులు. కృతయుగ ధర్మం తపస్సు! ఆ తపస్సు యొక్క ఉత్తమ ఫలాలు భూలోక వాసులకు అందివ్వాలన్న ఆశయంతో వారు హిమత్పర్వతంపై వెలసిన బదరీవనంలో ఈ మహావృక్షం క్రిందే ఆశ్రమమేర్పరచి ఆ తపో ఫలాన్ని భూలోకవాసులకు అందించారు. అంతటి ప్రశస్తియైనది ఈ వటవృక్షం (మర్రిచెట్టు).
అటువంటి మహత్తు కల్గిన వటవృక్షం (మర్రిచెట్టు) కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము పాలసముద్రం మండలం, రాచపాళ్యం గ్రామంలో వెలసింది. ఈ వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి ఇప్పుడు సుమారు మూడు ఎకరముల విస్తీర్ణములో విస్తరించి యున్నది. ఇంతటి ఉన్నతమైన, ఉత్కృష్టమైన, గొప్ప చరిత్ర గల ఈ వృక్షపు నీడలో ఎన్నో సంవత్సరాలకు పూర్వము మహిమాన్వితమైన, భక్తవత్సలుడు, ధీనజన రక్షకుడు, కోరిన కోర్కెలను ప్రసాదించే మహిమ గల్గిన - శ్రీశ్రీ బాలగురునాధ స్వామి వెలసియున్నాడు. ఈ స్వామి ఆకారములో పంచమూర్తులు కల్గియున్నాడు. ఈ స్వామి ఆకారములో పంచమూర్తులు కల్గియున్నారు. సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు విఘ్నరాజాధిపతి విఘ్నేశ్వరుడు, ఆరోగ్యప్రధాతయైన దేవాసేనాని శ్రీ సుబ్రమణ్యస్వామి. వీరి ప్రతిమలు "6" అడుగుల కల్గిన ఏకశిలా విగ్రహంలా ప్రతిష్ఠింపబడ్డారు. ఇటువంటి పంచమూర్తులు కల్గిన మహిమగల ఏకశిలా విగ్రహం మరెక్కడనూ మనకు కానరాదు.
సృష్టికార్యం ఏ విధంగా మొదలు పెట్టాలోనన్న ఆలోచనలో ఉన్న బ్రహ్మకు ధ్యానం భగ్నమైంది. మధు, కైటబులు అనే రాక్షసులు భీకరాకారంలో ఆయన దరిచేరి పద్మం విడిచి తమతో యుద్ధం చేయాలని పిలిచారు. వారిని ఎదుర్కొనే శక్తిలేని బ్రహ్మ విష్ణువును శరణుకోరాడు. యోగ నిద్ర నుండి లేచిన మహావిష్ణువు వారితో కొంతకాలం యుద్ధం చేసి ఆపైన యుక్తితో తన విశాలమైన తొడలమీదకు వాళ్ళను లాగి చక్రాయుధంతో వాళ్ళ శిరస్సును ఖండింపజేశాడు. శిష్ణువు తర్వాత బ్రహ్మకు ఉపదేశిస్తూ ఇక నిన్ను ఎదిరించేవారు ఎవరూ లేదిక్కడ. భూమికి ఆధారంగా చేసుకొని సృష్టి కార్యాన్ని ప్రారంభించమన్నాడు.
సత్యము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు గల ప్రకృతిలో పరమశివుని సంయోగం వలన "మహత్తత్వము" జనిస్తుంది. ఈ "మహత్తత్వము"లో నుండి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము అనే పంచతన్మాత్రలు, భూమి, జలము, వాయువు, అగ్రి, ఆకాశము అనే పంచభూతములు, ప్రకటిత మౌతాయి. వీటి సహాయంతో ప్రాణికోటిని సృజించవలసి వుంటుంది. అందుకే "మహత్తత్వానికి" మూలమైన పరమశివుని ధ్యానించమని, తద్వారా నీ కార్యం సఫలమౌతుందని బ్రహ్మకు ఉపదేశిస్తాడు మహావిష్ణువు.
బ్రహ్మకు విష్ణువు మాటలు రుచించలేదు. సృష్టికర్తను నేనని నా కన్నా మిన్న ఎవరని బ్రహ్మ అహం. "స్థితి కారకుడైన (విష్ణువు) నా ఆధిక్యతను మన్నించి నేను ఉపదేశించిన విధంగా చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. విష్ణువు మాటలను బ్రహ్మ మన్నించలేదు. ఇద్దరి మధ్యా వాగ్వివాదం అంతకంతకు తీవ్రతరమైనది. ఆ తరుణంలో ఫెళఫెళరావాలతో, కోటి విద్యుల్లతల కాంతితో ప్రకాశిస్తున్న దివ్యతేజోలింగం వారిద్దరి మధ్య ప్రత్యక్షమైనది. "సృష్టి (బ్రహ్మ), స్థితి (విష్టువు) కారకులారా! ఈ లింగం ఆద్యంతములు కనుకొన్నవారే అధికులు" అనే పలుకులు వెలువడ్డాయి. ఆ తేజోలింగం నుండి అలా వారి ఆదిరూపం కనుగొనాలి - విష్ణువు, అంత్యరూపం కనుగొనాలని బ్రహ్మ బయలుదేరి ఎంతోకాలం గడిచినా వారి ప్రయత్నాల్లో సఫలం కాలేకపోతారు. చివరకు వారిరువురూ తమ వివాదాన్ని పరిష్కరించ వలసినదిగా "ఆడ" ఆద్యంతరహితమైన జ్యోతిర్లింగ, ఓంకార స్వరూపుడైన పరమేశ్వరుని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలకు సంతృప్తుడై స్పటికం వంటి నిర్మల దేహకాంతితో, ప్రసన్నంగా చిరునవ్వులు చిందిస్తూ త్రిశూలాది దివ్యాయుధాలు ధరించి సగుణ రూపంలో లింగం నుండి సాక్షాత్కరించాడు పరమశివుడు.
పరమశివుడు చివరకు బ్రహ్మ యొక్క గర్వభంగం కావించి, జ్యోతిర్లింగం అంతము చూస్తానని అబద్ధం చెప్పిన బ్రహ్మ యొక్క ఐదవ ముఖాన్ని ఎడమ చిటికెన వ్రేలు కొనగోటితో ఖండింపజేస్తాడు. బ్రహ్మను ఆవరించిన మాయ తొలగిపోయింది. ఆయనలో గర్వాహంకారాలు నశించాయి. అప్పటి నుండి ప్రసన్న చతుర్ముఖుడుగా ప్రార్థనలందుకున్నాడు.
ఆ విధంగా సృష్టికర్త బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువు, లయ కారకుడైన పరమశివుడు ఒకే చోట కొలువైవున్న ప్రదేశమే శ్రీశ్రీ బాలగురునాధస్వామి దివ్య నిలయం (క్షేత్రం), శక్తి స్వరూపుడు, అర్థనారీశ్వరుడు, జగన్మాతా స్వరూపుడైన పరమశివుని దివ్య తేజోమయమైన ఆ దివ్యమంగళ స్వరూపుని అంశమే శ్రీశ్రీ బాలగురునాధస్వామి. ఈ స్వామి భక్తవత్సలుడు, భక్తుల కోర్కెలె కొంగుబంగారము. ఎందరికో సంతాన భాగ్యం కల్గించిన తేజోమయుడు. ఈ విధంగా త్రిమూర్తులు ఒక్కచోటే వెలసిన ప్రదేశము మరెక్కడనూ లేదు. మరియు సర్వవిగ్నాలహరుడు, ఆదిపూజలను అందుకొనే గణనాధుడు, సర్వరోగాలను నయంచేసి భక్తులచేత ఆరోగ్యప్రధాతగా పూజలు అందుకొనే శ్రీ సుబ్రమణ్య స్వామి వీరు ఐదుగురు మూర్తులు ఏకశిలలో ప్రతిష్ఠింపబడ్డారు.
ఇటువంటి పంచమూర్తులను ఏకశిలలో, ఏకకాలంలో ఒకే చోట మహోన్నత చరిత్ర గల్గిన దివ్య వటవృక్షం నీడలో వెలసిన ఈ దివ్యమంగళ ఏకశిలను దర్శించడము మానవ జన్మకు శాంతిని, సౌఖ్యాన్ని, సంతాన సౌభాగ్యాలను కల్గింపజేస్తుంది. పరమ పవిత్రతను చేకూరుస్తుంది. ఈ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి తరించవలసినదేగాని వర్ణింపనలవిగానిది.
ఓం శాంతి శాంతి శాంతి:
ఓం
శ్రీ శ్రీ బాలగురునాథ స్వామియే నమ:
ఈ దేవాలయంలో జరిగే విశేషమైన ఉత్సవములు (పండుగలు)
శివరాత్రి మహాత్యం:-
"మాఘ ఫాల్గుణ యోర్శద్యే కృష్ణపక్షే చతుర్దశి
శివరాత్రి రితిఖ్యాతౌ సర్వ యజ్ఞోత్తమోత్తమా
శివరాత్రి సమం నాస్తి వ్రతం పాపక్షయాప హాం
యాత్కృత్వా సర్వ పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయ:"
ప్రతి సంవత్సరము మాఘ మాసంలో మాఘ కృష్ణ చతుర్దశి రోజున వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి అంటే శివమయమైన, శుభప్రదమైన శివుని రాత్రి అని అర్థం. అర్థరాత్రి వరకు చతుర్ధశి తిధి వున్న రోజునే "శివరాత్రి" అంటారు. ఉపవాసము, అభిషేకాది పూజ, జాగరణము ఇవి మూడూ శివరాత్రి నాడు చేయవలసిన కార్యములు. మహాశివరాత్రి నాడు శివుడ్ని అభిషేకించి, అర్చించి, ఉపవశించి, జాగరణ కావించే శివరాత్రి వ్రతం కంటే మించిన గొప్పవ్రతం లేదు. శివరాత్రిని నియమ నిష్ఠలతో ఆచరించే భక్తులు సకల పాప విముక్తులై శివ సాయుజ్యం పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కనుకనే సకల శుభకర ప్రదాత్రి "మహాశివరాత్రి".
సంక్రాంతి :
ప్రతియేటా జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగను ఇక్కడ గత approx 400 సంవత్సరాలుగా ప్రజలు ఎంతో వైభవంగా, కన్నుల పండుగగా జరుపుకొనుచున్నారు. సంక్రాంతి ఉదయమే తలస్నానం చేసి భక్తులందరూ ఉపవాస దీక్షలో ఉండి ఉదయం 9గంటలకు స్వామివారికి పాలపొంగళ్ళను శిరస్సు మీద వుంచుకొని, దాదాపు 2కి.మీ. దూరం ప్రయాణించి గ్రామ ప్రజలందరూ భక్తి ప్రపత్తులతో పొంగళ్ళను వటవృక్షం క్రింద వున్న స్వామి వారి సన్నిధికి చేరుస్తారు. తర్వాత ఆలయ ఆవరణలోనే పొంగళ్ళు వండి, వార్చి తీసి పొంగళ్ళను స్వామి వారికి నైవేద్యంగా ప్రతి ఒక భక్తుడు, భక్తురాలు సమర్పించుకొంటారు. ఈ విధంగా చేయడం వలన తమ కొర్కెలు నెరవేరుతాయని గత 200 సంవత్సరాలుగా భక్తులు నమ్మకము. మధ్యాహ్నం స్వామి వారికి హారతి స్వీకరణ కోసం గ్రామాల్లోన్ని అన్ని వీధులకు తీసుకొని వెళ్తారు. ఈ సమయంలో ఊరేగింపుగా కోలాటం, పండరిభజన, కీలుబొమ్మలు, డప్పు వాయిద్యాలతో చూడ ముచ్చటగా స్వామి వారి ఊరేగింపు ముందు భాగంలో ఎంతో వైభవంగా సంప్రదాయ రీతులతో జానపద కళలను ప్రదర్శిస్తారు. ఈ సాయంత్రం ఆలయంలో స్వామి వారికి మహా మంగళ హారతి ఇస్తారు. రాత్రి స్వామి వారికి ఉత్సవమూర్తులకు ఊరేగింపు కన్నుల పండుగగా జరుపబడుతుంది. ఈ వైభవమంతా చూసి తరించ వలసినదేగాని చెప్పనలవికాదు.
పౌర్ణమి :
ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజున స్వామి వారిని అభిషేకించి, రకరకాల పూలతో అలంకరించి, భజనలు గావించి మంగళహారతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం నుండి పౌర్ణమి గడియలు ఉన్నంతవరకు స్వామి వారిని ఆలయం సరిహద్దుల మేర ప్రదక్షిణ గావించినచో గొప్ప పుణ్యఫలం లభిస్తుందని ఇది పూర్వీకుల నమ్మకం.
ఆడికృత్తిక :
శ్రీ వళ్ళీదేవసేనా సమేతులైన శ్రీ సుబ్రమణ్యస్వామి వారి ఆడికృత్తిక పండుగను కూడా ఇక్కడ ఎంతో వేడుకగా కనుల పండుగగా జరుపుకొంటారు. ఈరోజు భక్తులందరూ క్రొత్త బట్టలు (కాషాయ వస్ర్తాలు) ధరించి, ఉపవాస దీక్షతో వుండి స్వామివారికి కావిళ్ళను సమర్పిస్తారు. ఆలయంలోని పంచమూర్తుల విగ్రహానికి ఘనముగా పూజలు కావించి, కొందరు కావుళ్ళను ఇక్కడే చెల్లించడం జరుగుతుంది. మరికొందరు ప్రక్కనే ఉన్న తిరుత్తణిలో చెల్లించడం జరుగుతుంది.
కార్తీక దీపం :
శ్రీ బాలగురునాధస్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలలో కార్తీక దీపోత్సవం ఎంతో విశిష్ఠమైనది. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయమే తలస్నానం చేసి భక్తులందరూ స్వామి వారి ఆలయం చేరుకొని భజనలు చేయుదురు. ఉపవాస ధీక్ష వహించి సాయంత్రం స్వామివారిని విశేషమైన పూలతో అలంకరించి పూజలు చేస్తారు. ఈరోజు సాయంత్రం 108 లీటర్ల నెయ్యిని పెద్ద ప్రమిదలో పోసి కార్తీక దీపం వెలిగిస్తారు. ఈ కార్తీక దీపం రోజున స్వామి వారి ఆలయం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు గావించిన తమ కోర్కెలు నెరవేరి, పుణ్యం, అభీష్టసిద్ధి జలుగుతుందని భక్తుల నమ్మకము.
ఈ ఆలయ దర్శనము సకల పాపాలను దూరం చేస్తుంది. స్వామి అనుగ్రహం జ్ఞానాన్ని, తేజస్సును, ఆరోగ్యాన్ని, విజయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి